షాకింగ్‌ ఘటన.. భార్య శీలాన్ని శంకించి..

13 Feb, 2023 07:19 IST|Sakshi

రాయచూరు రూరల్‌(కర్ణాటక): భార్య శీలాన్ని శంకించి ఇద్దరు పిల్లలను హత్య చేసిన కిరాతక భర్త ఉదంతం రాయచూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... దేవదుర్గ తాలూకా జక్లేర్‌ దొడ్డిలో నింగప్ప (35), ప్రభావతి (30) దంపతులకు రాఘవేంద్ర (5), శివరాజ్‌ (3) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరు కూలిపనులు చేసుకుంటూ జీవించేవారు. నింగప్ప భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో రోజూ ఆమెతో గొడవపడేవాడు.

శనివారం రాత్రి కూడా అలాగే రగడపడ్డాడు. పిల్లలిద్దరూ అక్రమ సంబంధంతో పుట్టినవారేనని మండిపడ్డాడు. తరువాత కె.ఇరబగేరలో అవ్వ ఇంట్లో పిల్లలను జక్లేర్‌ దొడ్డి శివార్లకు బైక్‌ మీద తీసుకొని వచ్చాడు. వారిద్దరినీ గొంతు నలిపి హత్య చేసి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం ఈ ఘోరం గురించి తెలిసి తల్లి, బంధువులు గుండెలవిసేలా విలపించారు. పసిబిడ్డలను పొట్టనబెట్టుకున్నాడని రోదించారు. తల్లి దేవదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నింగప్పను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.   

మరిన్ని వార్తలు