సోన్ (నిర్మల్): నిర్మల్ జిల్లా సోన్ మండలం గాంధీ నగర్ గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఓ తండ్రి కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం ఈ సంఘటన చోటుచేసుకోగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. శనివారం ఉదయం తల్లి కూలీ పనులకు వెళ్లింది. అప్పటికే తాగిన మైకంలో ఉన్న తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆరేళ్ల కూతురిపై అత్యాచారం చేశాడు.
పనులకు వెళ్లిన తల్లి తిరిగి వచ్చేసరికి కూతురు నడవలేని స్థితిలో తీవ్ర రక్తస్రావంతో కనిపించింది. అనుమానం వచ్చిన తల్లి కూతురును అడగగా, తండ్రే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. విషయం తెలిసి ఆగ్రహించిన గ్రామస్తులు రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన ఆ తండ్రిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆదివారం ఉదయం డీఎస్పీ ఉపేందర్ రెడ్డి గ్రామంలో వివరాలు సేకరించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆసిఫ్ తెలిపారు.
( చదవండి: బాలికపై సవతి తండ్రి లైంగికదాడి )