Vikarabad: కొడుకు ప్రశ్నించాడని.. భోజనంలో విషం కలిపి 

28 Sep, 2022 11:49 IST|Sakshi
ఆస్పత్రిలో వెంకటేశం, తండ్రి పెంటయ్య

సాక్షి, వికారాబాద్‌: కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న తండ్రిని ప్రశ్నించినందుకు కొడుకునే హత్య చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన మోమిన్‌పేట  మండల పరిధిలో ఎన్కతల గ్రామంలో చోటుచేసుకుంది. ఎన్కతలకు చెందిన ఉప్పరి పెంటయ్య, గోవిందమ్మలు దంపతులు. వారికి వెంకటేశం, కృష్ణ ఇద్దరు కుమారులు. పెంటయ్య ఎద్దులు, మేకల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుండేవాడు.

భార్య గోవిందమ్మ కుమారులను చేరదీసి ఉన్న ఐదు ఎకరాల భూమిని సాగు చేసుకొంటూ కుటుంబాన్ని పోషిస్తోంది.  ఇటీవల భూముల ధరలు విపరీతంగా పెరగడంతో భూమిని అమ్ముదామని ఇంట్లో గొడవ పడుతుండేవాడు. అవసరం లేనిది భూమి అమ్మడం దేనికని కుమారులిద్దరూ అడ్డుపడుతున్నారు. ఈ నెల 24న ఉదయం పెద్ద కుమారుడు వెంకటేశం భోజనం చేసే సమయంలో అన్నంలో తండ్రి విషం కలిపాడు.

తెలుసుకోకుండా భోజనం చేసిన వెంకటేశం అస్వస్థకు గురి కావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అన్నంలో విషం కలిపారని తెలపడంతో తల్లి గోవిందమ్మ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకటేశం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్‌ తెలిపారు
చదవండి: అధికార పార్టీలో ఈడీ కుదుపు.. కేడర్‌లో ఆందోళన 

     

మరిన్ని వార్తలు