కొడుకును చంపించడానికి రూ.3 లక్షల సుపారీ

20 Jan, 2021 15:43 IST|Sakshi

సాక్షి, బెంగుళూరు : ఆస్తిలో వాటాకోసం హింసిస్తున్నాడన్న కోపంతో కొడుకును కిరాయి మనుషులను పెట్టి హత్యచేయించాడు ఓ వ్యాపారవేత్త. వివరాల ప్రకారం.. బెంగుళూరుకు చెందిన బీవీ కేశవ అనే బిజినెస్‌ మ్యాన్‌ జనవరి 10 నుంచి తన పెద్ద కుమారుడు కౌశల్‌ కనిపించకుండా పోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల అనంతరం ఎలిమల్లప్ప అనే చెరువు వద్ద విపరీతమైన దుర్వాసన వస్తోందని అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే విచారణ ప్రారంభించిన పోలీసులకు చెరువు సమీపంలో గోనె సంచిలో ముక్కలు ముక్కలుగా తెగిఉన్న శరీర భాగాలను చూసి షాకింగ్‌కు గురయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కౌశల్‌గా గుర్తించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కన్న తండ్రే సమీప బందువులకు సుపారి ఇచ్చి కొడుకుని హత్య చేయిండాని పోలీసులు నిర్ధారించారు.(విద్యార్థినులను వేధించిన టీచర్‌కు 49 ఏళ్ల జైలు)

కాగా కేసు దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషించాయి. హత్య జరిగిన రోజు రాత్రి నిందితులు ఓ మారుతీ కారులో చెరువు వద్దకు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. అక్కడే మృతుడు కౌశల్‌కు మద్యం తాగించి అనంతరం హత్యచేశారు. ఈ కేసులో ఇప్పటికే  ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరు వ్యాపారవేత్త కేశవ చిన్నకుమారుడి స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. ఇందుకు గాను 3 లక్షల రూపాయల డీల్‌ కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆస్తిలో వాటా కోసం తరుచూ హింసించడంతో కొడుకును చంపించాలని పథకం రచించినట్లు కేశవ అంగీకరించాడు.  (రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి)

మరిన్ని వార్తలు