దారుణం: 13 ఏళ్ల కూతురిని టవల్‌తో గొంతు నులిమి చంపిన తండ్రి

5 May, 2021 08:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నల్లగొండ: కన్నకూతురును తండ్రి దారుణంగా హత్య చేసిన ఘటన నల్లగొండలో చోటుచేసుకుంది. కాగా, ఈ కేసులో తండ్రికి జీవిత ఖైదుతో పాటు ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, రూ. 5వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి రమేష్‌బాబు మంగళవారం తీర్పు చెప్పారు. నల్లగొండ పట్టణంలోని బోయవాడకు చెందిన అంబూరి వెంకటేశ్‌ 2012లో లిటిఫ్లవర్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న 13ఏళ్ల కూతురు శివాణిని టవల్‌తో గొంతు నులిమి హత్య చేశాడు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 302, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని అప్పటి సీఐ మనోహర్‌రెడ్డి కోర్టుకు ఆధారాలు అందజేశారు.

వెంకటేశ్‌ భార్య ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తూ మృతి చెందడంతో తనకు ఆ ఉద్యోగం వస్తుందని తర్వాత మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఉద్యోగానికి, వివాహం చేసుకోవడానికి కుమార్తె శివాణి అడ్డుగా ఉందని ఘాతుకానికి తెగబడ్డాడు. విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువుకావడంతో న్యామూర్తి పైవిధంగా తీర్పునిచ్చినట్లు టూటౌన్‌ ఎస్సై నర్సింహులు తెలిపారు.  

మరిన్ని వార్తలు