రెండేళ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తండ్రి

17 Sep, 2021 20:27 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌:  ఈ పిల్లలకు నేను తండ్రి కాదు.. ఆ బాబు నాకు పుట్టలేదు అంటూ అరుస్తూ కత్తితో అతి కిరాతకంగా తన రెండేళ్ల కుమారుడి గొంతుకోసిన తండ్రి కుటుంబ సభ్యులను తోసేసి వెంటనే అక్కడి నుంచి పారిపోయిన ఘటన లంగర్‌హౌజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్‌హౌస్‌లో నివాసముండే హసీబ్‌(38)కు మొఘల్‌నగర్‌వాసి హస్రత్‌ బేగంతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది.

వీరికి ఇస్మాయిల్‌(2)తో పాటు 8నెలల మరో కుమారుడు ఉన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన అతడు నాలుగేళ్ల క్రితం ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉంటున్నాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం కుమారుడిని పైఅంతస్తులోని తన గదికి తీసుకెళ్లాడు. కొద్దిసేపటికే బాబు ఏడుస్తుండటంతో తల్లి హస్రత్‌ వెళ్లింది. కత్తి పట్టుకొని ఉన్న అతడు గట్టిగా అరుస్తూ.. ఈ పిల్లలకు నేను తండ్రి కాదంటూ గట్టిగా అరుస్తూ బాబు గొంతును కోశాడు.

హస్రత్‌ బేగం గట్టిగా ఆమె అత్తను పిలుస్తూ బాబును లాక్కుంది. ఆమె హసీబ్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా ఆమెను పక్కకు తోసేసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాబు ప్రాణాలు కోల్పోయాడు. లంగర్‌హౌస్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: సైదాబాద్‌ నిందితుడి కదలికలు: సింగరేణి కాలనీ టు నష్కల్‌

మరిన్ని వార్తలు