వివాహితను పెళ్లాడి.. ఆమె కూతురిపై కన్ను

6 May, 2022 08:59 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, పిఠాపురం (కాకినాడ): ప్రేమిస్తున్నానంటూ ఓ వివాహితను నమ్మించి, మొదటి భర్తకు విడాకులు ఇప్పించి, రెండో పెళ్లి చేసుకుని, ఆమె కూతురిపై కన్ను వేసిన ఓ కామాంధుడిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. ఆ వివాహిత ఓ ప్రైవేటు టీచర్‌. ఇద్దరు కుమార్తెలు, భర్తతో ఆనందంగా వైవాహిక జీవితం గడుపుతోంది. ఇంతలో సురేష్‌కుమార్‌ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టాడు. తనకు వివాహమైందని ఎంత చెప్పినా వినకుండా.. పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానంటూ భయపెట్టాడు.

అతడి ఒత్తిడికి తలొగ్గిన ఆమె విచక్షణ కోల్పోయి.. తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న భర్తకు విడాకులిచ్చి.. ఇద్దరు కుమార్తెలతో బయటకు వచ్చేసి, సురేష్‌కుమార్‌ను రెండో పెళ్లి చేసుకుంది. నాలుగేళ్లు తరువాత ఆమెపై మోజు తగ్గిన ఆ దుర్మార్గుడు అసలు రూపం చూపసాగాడు. ఆమెను చిత్రహింసలు పెట్టడమే కాకుండా, ఆమె ఇంట్లో లేనపుడు ఆమె కుమార్తెను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న తల్లి గొడవ పెట్టడంతో కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడ్డాడు.

చదవండి: (పెళ్లి చేసుకోవాలని కోరితే.. తల్లిని అడగాలని వెళ్లాడు.. అం‍తలోనే..)

రెండో పెళ్లి కూడా కావడంతో కాపురం ఎక్కడ చెడిపోతుందోనన్న భయంతో ఆమె అతడిని వదిలేసింది. అదే అదనుగా సురేష్‌కుమార్‌ ఆమెను చిత్రహింసలు చేయసాగాడు. రెండేళ్ల పాటు భరించిన ఆమె.. చివరకు తన అత్తగారింటికి వెళ్లి న్యాయం చేయాలని ప్రాధేయపడింది. వారు కూడా ఆమెను అవమానించి, గెంటేశారు. దీంతో స్పందన కార్యక్రమంలో తన గోడు వెళ్లబోసుకుంది. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపిన సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 

చదవండి: (ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..)

మరిన్ని వార్తలు