Fathers Day Tragedy: చిన్నారి కూతురు ఆత్మహత్య.. ఆగిన తండ్రి గుండె

21 Jun, 2021 09:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మండ్య: ప్రపంచ తండ్రుల దినోత్సవంనాడు సంతోషంగా శుభాకాంక్షలు చెప్పాల్సిన కుమార్తె ఉరితాడుకు వేలాడడం చూసి తండ్రి గుండెపోటుతో తనువు చాలించాడు. ఈ ఘోరం మండ్య జిల్లా మళవళ్లి తాలూకాలోని తళగవాది గ్రామంలో ఆదివారం జరిగింది. బాలిక బాంధవ్య (17), ఆమె తండ్రి కె.రాజు (65) మృతులు.  రాజుకు నలుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్నకూతురు బాంధవ్య ఇంటర్‌ ఫస్టియర్‌ మైసూరులోని ఒక ప్రైవేట్‌ కళాశాల్లో చదువుతోంది. కరోనా ఇబ్బందుల నేపథ్యంలో సెకెండియర్‌ను ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాలని తండ్రి సూచించగా కూతురు ససేమిరా అంది.

ఏదైనా మంచి ప్రైవేటు కాలేజీలోనే చదువుకుంటానని చెప్పగా తండ్రి ఒప్పుకోకపోవడంతో ఆవేదనకు లోనైంది. ఆదివారం ఉదయం 8 గంటలప్పుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి రాజు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఇరువురి మరణంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మళవళ్ళి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.  

తండ్రీ, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య 
తండ్రుల దినోత్సవంనాడు మరో విషాదం సంభవించింది. ఓ తండ్రి, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా పోగత్యానట్టి గ్రామంలో ఆదివారం జరిగింది. కాడప్ప పి. రంగాపపురె (48), ఆయన కుమార్తెలు కీర్తి (18), స్ఫూర్తి (16) మృతులు. వారం రోజుల క్రితం కాడప్ప భార్య చెన్నవ్వ మృతి చెందారు. ఆమె మృతిని తట్టుకోలేక జీవితం విరక్తితో సామూహిక బలవన్మరణాలకు పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. 

చదవండి:  భూతగాదాలు, పాత కక్షలు.. పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా..


 

మరిన్ని వార్తలు