పాక్‌లో దారుణం: మహిళా టిక్‌టాకర్‌పై 300 మంది దాడి!

18 Aug, 2021 11:34 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా టిక్‌టాకర్‌పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్ట్14 పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఓ టిక్‌టాకర్‌ తన ఆరుగురు స్నేహితులతో కలిసి లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద టిక్‌టాక్‌ వీడియోను చిత్రీకరించాలనుకున్నారు. ఆ సమయంలో సుమారు 300మంది ఆమెను చుట్టిముట్టి దాడికి పాల్పడ్డారు. ఆమెను గాల్లోకి ఎగరేస్తూ దుస్తులు చించడానికి యత్నించారు. ఆమె చుట్టూ చేరిన వందలాది మంది నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఎంతకు సాధ్యం కాలేదు.

ఈ పరిస్థితిని గమనించిన సెక్యూరిటీ గార్డు మినార్-ఇ-పాకిస్తాన్ గేటు తెరవటంతో అక్కడి నుంచి తన స్నేహితులతో ఆమె బయటపడింది. బలవంతంగా ఆమె చేతి ఉన్న ఉంగరం, చెవి రింగులు, తన స్నేహితుల వద్ద ఉన్న మోబైల్‌ ఫోన్‌, ఐడీ కార్డు, రూ.15 వేలను లాక్కున్నారు. ఈ ఘటనపై సదరు టిక్‌టాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. వీడియో చూసిన నెటిజన్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు