సాక్షి, ముంబై : బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ కేంద్రంగా మాదకద్రవ్యాల డొంక కదులుతోంది. సుశాంత్ సింగ్ రాజపుత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయసాహా దర్యాప్తులో కీలక పేర్లు బయటకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ మధు మంతెన బుధవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎదుట విచారణకు హాజరయ్యారు. జయసాహా డ్రగ్ చాట్స్లో ఆయన పేరు ఉండడంతో సమన్లు పంపారు దర్యాప్తు అధికారులు. అలాగే మధు మంతెనకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు జయసాహా ఒప్పుకున్నారు. దీంతో మధు మంతెన, జయసాహా ఇద్దరినీ ఎదురెదురుగా పెట్టి విచారించేందుకు సిద్ధమయ్యారు ఎన్సీబీ అధికారులు. గజినీ, క్వీన్, ఉడ్తా పంజాబ్, సూపర్ 30 వంటి హిట్ చిత్రాలకు మధు మంతెన నిర్మాతగా వ్యవహరించారు. (సుశాంత్ డ్రగ్స్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు)
కాగా, బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాకు కేంద్ర బిందువుగా కనిపిస్తున్న క్వాన్ ట్యాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీపై ఫోకస్ పెట్టింది ఎన్సీబీ. బాలీవుడ్లో పలువురు స్టార్స్కి ఈ కంపెనీ సిబ్బంది ట్యాలెంట్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్, సుశాంత్ మాజీ ట్యాలెంట్ మేనేజర్ జయసాహా ఏజెన్సీ కిందే పనిచేస్తున్నారు. దీంతో క్వాన్ ఏజెన్సీ లావాదేవీలపై కూపీ ఎన్సీబీ కూపీలాగుతోంది. అంతేకాకుండా క్వాన్ ట్యాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలో స్టార్ హీరో సల్మాన్ఖాన్కు మేజర్ షేర్ ఉందని వార్తలు రాగా... ఆయన లాయర్ ఖండించారు. ఆ సంస్థతో సల్మాన్కు ఎలాంటి సంబంధంలేదని స్పష్టంచేశారు.