ముదురుతున్న వివాదం : ఫేస్‌బుక్ కీలక అధికారిపై కేసు

18 Aug, 2020 14:51 IST|Sakshi
ఫైల్ ఫోటో

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం  రగడ

ఫేస్‌బుక్  ఇండియా పాలసీ హెడ్ పై ఫిర్యాదు

రాయ్‌పూర్‌: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అధికార బీజేపీకీ వత్తాసు పలుకుతోందన్న వాల్‌స్ర్టీట్‌ జర్నల్‌ కథనంపై వివాదం మరింత ముదురుతోంది. తాజాగా ఫేస్‌బుక్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంకిదాస్, మరో ఇద్దరిపై ఛత్తీస్‌గడ్ పోలీసులు  కేసు నమోదు చేశారు. ఆన్‌లైన్ ద్వారా తనకు హత్యా బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులకు అంకిదాస్ ఇచ్చిన ఫిర్యాదులో తివారీపై కేసు నమోదు చేసిన  అనంతరం ఈ పరిణామం  చోటు చేసుకుంది. (బీజేపీకి వత్తాసు : ఫేస్‌బుక్‌ క్లారిటీ)

మతపరమైన మనోభావాలను దెబ్బతీసారని ఆరోపిస్తూ రాయ్‌పూర్‌కు చెందిన జర్నలిస్ట్ అవేష్ తివారీ ఫిర్యాదు మేరకు సోమవారం అర్థరాత్రి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫేస్‌బుక్ ఇండియా డైరెక్టర్, పబ్లిక్ పాలసీ హెడ్ అంకిదాస్‌తో పాటు, ముంగేలికి చెందిన రామ్ సాహు, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వివేక్ సిన్హా అనే  ఫేస్‌బుక్ వినియోగదారులపై కూడా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు తెలిపారు.

వాల్ స్ట్రీట్ జర్నల్‌  కథనం ఆధారంగా తాను పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ పై  వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు, కాల్స్ వస్తున్నాయని తివారి తన ఫిర్యాదులో  పేర్కొన్నారు. మతపరమైన ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ద్వారా అంకిదాస్, సాహు, సిన్హా తనను పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని,  తన ప్రాణానికి ముప్పు ఉందని, తాను నిరంతరం భయంతో బతుకుతున్నానంటూ ఆరోపించారు. ఫేస్‌బుక్ ప్రతినిధి తనపై వేసిన ఆరోపణలను తివారీ ఖండించారు. ఫిర్యాదులో తన పేరుకు ఎందుకు పేరు పెట్టారో తనకు అర్థం కాలేదన్నారు. గతంలో ప్రభుత్వ విధానాలను విమర్శించిన తన పోస్టులను ఫేస్‌బుక్ ఏకపక్షంగా సెన్సార్ చేసిందని తివారీ ఆరోపించారు. 25 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్టుగా ప్రశ్నించడం తన కర్తవ్యమన్నారు. 

చదవండి :  వాల్‌స్ర్టీట్‌ కథనం నేపథ్యంలో ఎఫ్‌బీ అధికారికి బెదిరింపులు

మరిన్ని వార్తలు