అయ్యా.. ఇక మాకు దిక్కెవరు?

1 Dec, 2021 11:46 IST|Sakshi
బాలకృష్ణన్‌ భార్య మంగమ్మ 

నా భర్త చావుకు అటవీ అధికారులే కారణం 

తమిళనాడుకు చెందిన బాలకృష్ణన్‌ భార్య మంగమ్మ ఆరోపణ

ఇటీవల లారీలో నుంచి కింద పడి మృతి చెందిన బాలకృష్ణన్

సాక్షి, ప్రొద్దుటూరు క్రైం: ‘అయ్యా.. మాకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు.. కుటుంబ పెద్దదిక్కైన నా భర్త చనిపోతే ఇక మాకు దిక్కెవరు?’ అని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నవంబర్‌ 26న  ప్రొద్దుటూరు మండలంలోని బొజ్జవారిపల్లె క్రాస్‌ వద్ద తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఐషర్‌ వాహనంలో నుంచి కింద పడి మృతి చెందాడు. అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. 27న పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని మున్సిపల్‌ సిబ్బందికి అప్పగించారు. అయితే వాట్సప్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తన భర్త మృతి చెందాడని తెలుసుకున్న తమిళనాడు ధర్మపురి జిల్లా, సిత్తేరి గ్రామానికి చెందిన మంగమ్మ ప్రొద్దుటూరుకు వచ్చారు. మృతి చెందిన వ్యక్తి తన భర్త బాలకృష్ణన్‌ అని తెలిపారు. ఆమెతో పాటు మరో ఆరుగురు బంధువులు ఉన్నారు. వారు మంగళవారం రూరల్‌ పోలీసులను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

చదవండి: (మహిళను నమ్మించి.. పది నిమిషాల్లో వస్తానని చెప్పి..)

అటవీ శాఖ అధికారులపై మంగమ్మ ఆరోపణలు..
ప్రొద్దుటూరులో స్థిరపడి, బాగా తెలుగు మాట్లాడగలిగే తమిళనాడుకు చెందిన వ్యక్తిని పిలిపించి మంగమ్మ బంధువులతో పోలీసు అధికారులు మాట్లాడించి వివరాలు తెలుసుకున్నారు. బాలకృష్ణన్‌తో పాటు తమిళనాడులో రామన్‌ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఆమె బంధువులు పోలీసులకు తెలిపారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియలేదన్నారు. అటవీ శాఖ అధికారుల వద్దకు వెళ్తే కనీసం వారు మాట్లాడలేదని, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మంగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త చావుకు అటవీశాఖ అధికారులే కారణమని ఆరోపించారు.  కాగా, ఈ విషయమై అటవీ అధికారులను సంప్రదించగా, డీఆర్‌వో గుర్రప్ప స్పందిస్తూ ఈ కేసు విషయమై తమ దగ్గరకు ఎవరూ రాలేదని, తమను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు.

మరిన్ని వార్తలు