బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు

11 Jan, 2021 12:01 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మాయ శంకర్‌ పతాక్‌ చిక్కులో పడ్డారు. తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. చబీపూర్‌ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వారణాసి సమీపంలోని భగుటా గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని శంకర్‌ పతాక్‌కు చెందిన విద్యాసంస్థల్లో ఇంటర్‌ అభ్యశిస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థినిని తన రూమ్‌లోకి పిలుపించుకున్న ఆయన.. మొదట ఆమెపై దాడికి పాల్పడి ఆపై లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా కళాశాలకు చేరుకుని పతాక్‌కు నిలదీయగా క్షమాపణలు చెప్పి తప్పించుకున్నాడు. దీంతో దీనిపై యువతి నుంచి ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు అందలేదు. అయితే ఈ ఘటన జరిగిన చాలా కాలం తరువాత ఆ యువతి ఓ వీడియోను విడుదల చేసింది.

తనపై పతాక్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడని, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశాడని వీడియోలో పేర్కొంది. అంతేకాకుండా వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా బీజేపీలో సీనియర్‌ నేతగా పేరొందిన 70 ఏళ్లు శంకర్‌.. 1991లో ఓసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత విద్యాసంస్థలను స్థాపించి వాటికి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. తాజాగా అతనిపై లైంగిక ఆరోపణలు రావడంతో బీజేపీ నేతలు స్పందించారు. చాలాకాలం నుంచి అతను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. మరోవైపు ఆ యువతి లీక్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో కేసు విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు.

>
మరిన్ని వార్తలు