సచివాలయం నకిలీ పత్రాల ఫోర్జరీ కేసులో నలుగురి అరెస్ట్‌

30 Sep, 2020 04:56 IST|Sakshi
పోలీసులు అదుపులోకి తీసుకున్ననిందితులు

తాడికొండ: ఏపీ సచివాలయంలో నకిలీ పత్రాలను ఫోర్జరీ చేసి మోసం చేసిన నలుగురు వ్యక్తులను గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంత్రి కొడాలి నాని పేషీలో ఔట్‌ సోర్సింగ్‌ అటెండర్‌గా పనిచేస్తున్న సతీష్‌ వర్మ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానంటూ యాగయ్య అనే వ్యక్తి వద్ద రూ. 3.30 లక్షలు తీసుకున్నాడు. ఈ నగదును మధ్యవర్తులుగా వ్యవహరించిన ఆరుగురు వ్యక్తులు పంచుకుని.. ఉద్యోగం ఇస్తానని చెప్పిన వ్యక్తికి నకిలీ డాక్యుమెంట్‌ ఇచ్చారు.

బాధితుడు యాగయ్య ఆ డాక్యుమెంట్‌ను తీసుకొని తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ సచివాలయంలోని సివిల్‌ సప్లయిస్‌ పేషీలో కలవగా, అధికారులు అది నకిలీదని  గుర్తించి అదే విషయం అతనికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ వ్యవహారంలో ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి సతీష్‌ వర్మ, షేక్‌ బాజీ, మేడా వెంకట రామయ్య, వంశీకృష్ణ అనే నలుగురిని అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన సౌజన్య, ఒంగోలుకు చెందిన క్రాంతి కుమార్‌ పరారీలో ఉన్నందున వారి కోసం గాలింపు చేపట్టినట్టు చెప్పారు.  

మరిన్ని వార్తలు