దైవ దర్శనానికి వెళ్లొస్తూ..

3 Apr, 2022 02:52 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

ఒకరికి తీవ్రగాయాలు

రోడ్డు పక్క కాంక్రీట్‌ దిమ్మను ఢీకొన్న కారు

నాగర్‌కర్నూల్‌ జిల్లా తుర్కపల్లి సమీపంలో ఘటన 

మృతులు ఉమ్మడి నల్లగొండకు చెందిన ఒకే కుటుంబసభ్యులు 

చారకొండ: దైవ దర్శనానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదానికిగురై దుర్మరణం చెందారు. ఈ ఘటనలో గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలం తుర్కపల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసు కుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన దం పతులు గౌస్‌ఖాన్‌ (50), ఫర్హానా (42), కుమారు డు ఇంతియాజ్‌తో పాటు నల్లగొండ జిల్లా కొండ మల్లేపల్లికి చెందిన గౌస్‌ఖాన్‌ సోదరి సాదిక (51), ఆమె కుమారుడు రోషన్‌ (31) కలసి కారులో శుక్రవారం మధ్యాహ్నం ఏపీలోని వైఎస్సార్‌ కడప జిల్లా లో ఉన్న హజ్రత్‌ అమినా పీరాన్‌ దర్గాకు వెళ్లారు.

దర్శనం చేసుకున్నాక అర్ధరాత్రి తిరుగు ప్రయాణమ య్యారు. శనివారం ఉదయం 7.30 గంటలకు వారు ప్రయాణిస్తున్న కారు తుర్కపల్లి సమీపంలోకి చేరుకోగానే జడ్చర్ల–కోదాడ ప్రధాన రహదారిపై అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాంక్రీట్‌ దిమ్మెను బలంగా ఢీకొంది. దీంతో ఇంతియాజ్‌కు తీవ్ర గాయాలు కాగా మిగతా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఇంతియాజ్‌ను అంబులెన్స్‌లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాలను కల్వకుర్తి ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.

చారకొండ ఎస్‌ఐ శ్రీనివాస్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ మనోహర్, కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు, సీఐ రామకృష్ణ పరిశీలించారు. కారు నడిపిన రోషన్‌ నిద్రమత్తులో ఉండడంతోపాటు పాటు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఏడాది క్రితం తుర్కపల్లి సమీపంలో రోడ్డు విస్తరణ చేపట్టారు. పాతరోడ్డుకు ఉన్న కల్వర్టును కూల్చివేసి కొత్తది నిర్మించారు. అయితే రోడ్డు పక్కన కాంక్రీట్‌ దిమ్మని అలాగే వదిలేశారని గ్రామస్తులు తెలిపారు.

చదవండి: లిసి బతకలేమని.. ప్రియుడి మృతి, చున్నీ తెగిపడి..

మరిన్ని వార్తలు