బతికుండగానే ‘బలి’చేద్దామనుకున్నారు.. 

8 Aug, 2021 03:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఖననం చేయబోతుండగా శిశువు ఏడుపు.. పరారైన దుండగులు  

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ) : అది విశాఖ కాన్వెంట్‌ జంక్షన్‌లోని హిందూ శ్మశాన వాటిక.. సాయంత్రం వేళలో అక్కడకు ఏపీ31 డీఎఫ్‌ 0741 నంబర్‌ గల ఓ కారు చేరుకుంది. అందులోంచి నలుగురు వ్యక్తులు దిగారు. వారి చేతిలో ఓ శిశువు కవర్లో చుట్టి ఉంది. పాప చనిపోయిందని అక్కడి సిబ్బందితో చెప్పారు. ఏ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారని ప్రశ్నించాడు శ్మశాన వాటిక ఇన్‌చార్జి. అందుకు వాళ్లు.. రైల్వే న్యూకాలనీలోని కృష్ణా మెటర్నిటీ నర్సింగ్‌ హోమ్‌ నుంచి తెచ్చామంటూ.. ఓ లేఖను ఆయన చేతిలో పెట్టారు. కవర్లో ఉన్న శిశువును శ్మశాన వాటిక సిబ్బందికి అందించారు. శిశువును పూడ్చడం కోసం సిబ్బంది కవర్‌ను తెరవగా.. ఒక్కసారిగా శిశువు ఏడ్వడం ప్రారంభించింది. ఒక్కసారిగా హతాశులైన సిబ్బంది.. తర్వాత తేరుకుని.. ఆ నలుగురినీ నిలదీశారు. దీంతో వారు అక్కడ నుంచి పారిపోయారు.

శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన శ్మశానవాటిక సిబ్బందిని తీవ్రంగా కలచివేసింది. వెంటనే వారు శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆ ఆస్పత్రి సిబ్బంది కూడా వీరితో దురుసుగా ప్రవర్తించారు. బిడ్డను ఆస్పత్రిలో వదిలి బయటికి వెళ్లమంటూ కసురుకోవడంతో బిడ్డను ఆస్పత్రిలో వదిలి బయటికి వచ్చారు. దీనిపై శ్మశాన వాటిక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అసలు శిశువును ఆ ఆస్పత్రి నుంచే తీసుకొచ్చారా? లేక నకిలీ రశీదు సృష్టించారా? ఇంతకీ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎవరు? ఎందుకు చంపాలనుకున్నారు? తీసుకొచ్చిన ఆ నలుగురు ఎవరు? తదితర విషయాలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఘటనపై శనివారం శ్మశానవాటిక ఇన్‌చార్జి ప్రసన్నకుమార్‌ కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆస్పత్రి సిబ్బంది ఆ చిన్నారిని ఐసీయూలో ఉంచినట్టుగా తనకు సమాచారం తెలిసిందని ‘సాక్షి’తో చెప్పారు. 

మరిన్ని వార్తలు