డబ్బుల కోసం వక్రమార్గం

27 Oct, 2021 03:48 IST|Sakshi
నిందితుల అరెస్ట్‌ను చూపుతున్న చంద్రగిరి పోలీసులు

గంజాయి తరలిస్తున్న నలుగురు విద్యార్థుల అరెస్టు

5.4 కేజీల గంజాయి స్వాధీనం

చంద్రగిరి: కొందరు విద్యార్థులు సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో వక్రమార్గం పట్టారు. గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ వివరాలను తిరుపతి వెస్ట్‌ డీఎస్పీ నరసప్ప మీడియాకు వెల్లడించారు. తిరుపతికి చెందిన 9 మంది యువకులు మంగళవారం ఉదయం నరసింగాపురం రైల్వేస్టేషన్‌ నుంచి చంద్రగిరికి వస్తున్నారు. వీరిని సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ నాయక్, హిమబిందు తమ సిబ్బందితో కలిసి ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.

రేజర్ల జాన్‌తరుణ్‌(బీటెక్‌), దిలీప్‌కుమార్‌(ఇంటర్‌), గుణసాగర్‌(బీకాం), అఖిల్‌రెడ్డి(బీకాం), పెరుగొండ హర్ష(హోటల్‌ మేనేజ్‌మెంట్‌)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తమ లగేజీ బ్యాగుల్లో దాచిన 5.4 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన శ్రావణ్, రాజేష్, రూపేస్, హరీష్‌ల కోసం గాలిస్తున్నారు. వీరిలో కొందరు చదువుకుంటుండగా, మరికొంత మంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. గంజాయి రవాణాను అడ్డుకున్న పోలీసులను తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు అభినందించి.. రివార్డులు ప్రకటించారు. 

మరిన్ని వార్తలు