అదర్‌ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ

11 Sep, 2022 06:13 IST|Sakshi

సీరం సంస్థను మోసగించిన సైబర్‌ దొంగలు

ముంబై: వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా పేరు చెప్పి సైబర్‌ నేరగాళ్లు రూ.కోటికి పైగా కాజేశారు. మహారాష్ట్రలోని పోలీసులు శనివారం ఈ మేరకు వెల్లడించారు. వెంటనే డబ్బు బదిలీ చేయాలంటూ పూనావాలా పేరిట సీరం సంస్థ డైరెక్టర్‌ సతీశ్‌ దేశ్‌పాండేకు సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్‌ పంపించారు. కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను వాట్సాప్‌ చేశారు.

దాంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు. ఆ మెసేజ్‌ పూనావాలా పంపలేదని తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పుణే పోలీసులు చీటింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సీరం కంపెనీ కరోనా టీకా కోవిషీల్డ్‌తో సహా ఇతర వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. పుణే సమీపంలో సీరం ప్లాంట్‌ ఉంది.

మరిన్ని వార్తలు