Gandhi Hospital: అత్యాచారం కేసు.. దొరకని మహిళ ఆచూకీ

18 Aug, 2021 15:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై జరిగిన సామూహిక అత్యాచార కేసులో కనిపించకుండా పోయిన మహిళ కోసం సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది. నార్త్ జోన్‌లో ఉన్న పోలీసులతో పాటు, పలు టీమ్‌లు గాంధీ అసుపత్రిలో కనిపించకుండా పోయిన మరో బాధితురాలి కోసం ఆసుపత్రి మొత్తం జల్లెడ పడుతున్నారు. ఆమె దొరికితేనే అసలు విషయం బయటపడే అవకాశం ఉండడంతో 10 అంతస్తుల గాంధీ ఆస్పత్రిలోని 379 గదులను వెతుకుతున్నారు. డ్రైనేజితో మొదలుకొని చెట్ల పొదల వరకు ఏదీ వదలకుండా పోలీసులు గాలిస్తున్నారు.

పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలతో మిస్సింగ్‌లో ఉన్న మహిళ ఫోటో పట్టుకొని ప్రతి ఒక్కరికి చూపించి విచారణ జరుపుతున్నారు. కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పని చేయకపోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. అయితే  ఉన్న కెమెరాలోనే ఆమె విజువల్స్‌ కోసం పోలీసులు తీవ్ర స్థాయిలో అన్వేషిస్తున్నారు. మొత్తానికి గాంధీ ఆస్పత్రిలో ప్రతి ఫ్లోర్‌తోపాటు అన్ని గదులను జల్లెడ పడుతూ ఆమె కోసం వెతుకుతున్నారు.
చదవండి: గాంధీ ఘటన.. ఇంకా మిస్టరీనే!

కాగా గాంధీ ఆసుపత్రిలో తనతోపాటు తన సోదరిపైనా సామూహిక అ‍త్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన కేసు దర్యాప్తును హైదరాబాద్‌ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఉదంతంపై స్పష్ట సాధించడంతో పాటు ఇప్పటికీ ఆచూకీ లేని మరో బాధితురాలిని కనిపెట్టడం కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే బాధితురాలు చెప్తున్న విషయాల్లో పొంతన లేకపోవడంతో ఇదంతా కల్లు ప్రభావంతో జరిగిన లొల్లిగానూ అనుమానిస్తున్న అధికారులు.. ఆ కోణంలోనూ ఆరా తీసుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం. అదృశ్యమైన మహిళ వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడంతో దర్యాప్తు జఠిలంగా మారింది.

మరిన్ని వార్తలు