గాంధీ అత్యాచార ఘటనలో మరో ట్విస్ట్.. సెక్యూరిటీ గార్డు రాము అదృశ్యం

18 Aug, 2021 10:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం ఘటనలో మరో ట్విస్ట్‌ విలుగు చూసింది. గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న మరో సెక్యూరిటీ గార్డు రాము అదృశ్యం అయ్యాడు. సెక్యూరిటీ గార్డు రాము ఈనెల 14 నుంచి కనిపించడం లేదు. అయితే అత్యాచార ఘటనలో సెక్యూరిటీ గార్డు రాము పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు మరో మహిళ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నిందితులు ఉమామహేశ్వర్‌, సెక్యూరిటీ గార్డును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న బాధితురాలు పేర్కొన్న దాని ప్రకారం గాంధీ ఆసుపత్రి నుంచి అక్కా చెల్లెళ్లు ఈ నెల 8న అదృశ్యమయ్యారు.

ఆ తర్వాతే వీరిపై సామూహిక అత్యాచారం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించిన ప్రత్యేక బృందం గాంధీ ఆసుపత్రి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించింది. కొన్ని కెమెరాల్లో ఫీడ్‌ ఆధారంగా ఇప్పటికీ ఆచూకీ లేని మహిళ (బాధితురాలి సోదరి) ఈ నెల 11 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తనంతట తానుగా గాంధీ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కొందరు ప్రత్యక్షసాక్షుల్ని విచారించిన నేపథ్యంలో బాధితురాలు సైతం 14వ తేదీ కూడా గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నట్లు తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు