మాయలేడి: పరిచయం, రెండేళ్ల ప్రేమ.. పెళ్లనగానే!

18 Apr, 2021 15:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జైపూర్‌(మంచిర్యాల): ప్రాణంగా ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జైపూర్‌ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కాన్కూర్‌ గ్రామానికి చెందిన మధునక్క, శంకర్‌ దంపతుల కుమారుడు మహేశ్‌ డిగ్రీ చదువుతూనే ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేశాడు. అక్కడే మంచిర్యాలలోని చున్నంబట్టి వాడకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్లపాటు ప్రేమించుకున్నారు.

ఇటీవల మహేశ్‌ యువతి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుంటానని తెలపగా.. యువతి పోలీసులను ఆశ్రయించి తనకు మహేశ్‌తో పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన మహేశ్‌ శుక్రవారం కాన్కూర్‌ గ్రామ సమీపంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రెఫర్‌ చేశారు. కుటుంబసబ్యులు హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, తాను ప్రేమించిన అమ్మాయి సుఖంగా ఉండాలన్ని మహేశ్‌ రాసిన సూసైడ్‌నోట్‌ లభించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.  

మరిన్ని వార్తలు