ఎందుకిలా చేశావు తల్లీ... 

26 Feb, 2021 09:54 IST|Sakshi
ఎర్నమ్మ (ఫైల్‌) 

ఆదర్శ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

హతాశులైన పాఠశాల సిబ్బంది

కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు 

లక్కవరపుకోట(విజయనగరం జిల్లా): తల్లి దివ్యాంగురాలు... తండ్రి అమాయకుడు. ఇద్దరికీ అక్షరమ్ముక్క రాకపోయినా... పెళ్లైన 14ఏళ్లకు పుట్టిన చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. చదువులో రాణిస్తూండటంతో ఎంతో మురిసిపోయారు. ఒక్కగానొక్క కూతురు తమదగ్గర లేకుండా హాస్టల్‌లో ఉండి చదువుతుకుంటున్నా... తట్టుకున్నారు. ఏమైందో ఏమోగానీ... ఆ చదువుల తల్లి పాఠశాల ఆవరణలోనే బలవన్మరణానికి పాల్పడింది. అందరినీ వి షాదంలోకి నెట్టేసింది. ఎంతో చురుకుదనం... తోటి విద్యార్థులతో కలుపుగోరుతనం... అన్నింటా ఆమే ముందుండే తత్వం. అందుకే అందరి తలలో నాలుకగా మెలిగింది. ఆమె ఉన్నట్టుండి కన్నుమూయడం అక్కడివారందరినీ కలచివేసింది.

మండలంలోని చందులూరు గ్రామానికి చెందిన గనివాడ శివ, రామాయమ్మ దంపతుల కుమార్తె గనివాడ ఎర్నమ్మ(16) లక్కవరపుకోట ఆదర్శపాఠశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌(బైపీసీ) చదువుతోంది. ఈ నెల 16వ తేదీన ఆమెకు ఆరోగ్యం బాగోలేక తమ స్వగ్రామం వెళ్లింది. ఆమె తండ్రి ఎస్‌.కోట ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. కొద్దిగా ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం ఉదయం 11 గంటల సమయంలో తన తండ్రి శివతో కలిసి హాస్టల్‌కు వచ్చింది. ఇన్నాళ్లు ఎందుకు రాలేదని హాస్టల్‌ వార్డెన్‌ కె.ముత్యమమ్మ ప్రశ్నించారు.

ఆరోగ్యం బాగోలేదనీ, ఇంకా నీర్సంగా వున్నందున మధ్యాహ్నం తరగతికి వెళ్తానని చెప్పి మొదటి అంతస్తులోగల హాస్టల్‌ గదికి వెళ్లిపోయింది. తండ్రి శివ తమ స్వగ్రామం వెళ్లిపోయాడు. ఇంతలో ఏమైందో ఏమో గదిలో గల చున్నీని ఫ్యాన్‌తో ఉరివేసుకుంది. మధ్యాహ్నం భోజనంకోసం కంచాలు తెచ్చుకునేందుకు తోటిపిల్లలు గదిలోకి వెళ్లేసరికి ఫ్యాన్‌కు ఎర్నమ్మ వేలాడుతూ వార్డెన్‌కు సమాచారం అందించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై కె.లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి శివ హాస్టల్‌కు చేరుకున్నారు. ఆయన నుంచి ఫిర్యాదు స్వీకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు.

అన్నింటికీ తండ్రే...                           
పెళ్లైన 14ఏళ్లకు లేకలేక కలిగిన ఆ అమ్మాయి అంటే తల్లిదండ్రులకు వల్లమాలిన ప్రేమ. ఆమెకు ఏ కష్టం వచ్చినా తండ్రే అన్నీ చూసుకునేవాడు. జీవితంలో స్థిరపడి తమకు ఆసరాగా నిలుస్తుందనుకుని ఎన్నో కలలు కన్నారు. వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఏం జరిగిందో కూడా తెలుసు కోలేని ఆ అమాయక తండ్రిని చూసి అంతా కంటతడిపెట్టారు. ఎర్నమ్మ చదువులో ఎంతో చురుగ్గా వుండేదని భోధనా సిబ్బంది తెలిపారు. విద్యాశాఖ రీజనల్‌ డైరెక్టర్‌ ఆర్‌.నాగేశ్వరరావు,.డిప్యూటీ విద్యాశాఖ అధికారి కె.బ్రహ్మాజీ, మండల విద్యాశాఖాధికారి సీహెచ్‌.కూర్మారావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రిన్సిపాల్‌ కె.ధర్మకుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చదవండి:
దారుణం: అమ్మానాన్నలే అమ్మేశారు..  
బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! 

మరిన్ని వార్తలు