డీబార్‌ చేశారని మనస్థాపం.. హాస్టల్‌పై నుంచి దూకి ఆత్మహత్య

6 Mar, 2022 11:56 IST|Sakshi
భవ్య( ఫైల్‌ ఫొటో)

బెంగళూరు: పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిన ఆరోపణలతో కాలేజీ నుంచి డీబార్‌ చేయడంతో విద్యార్థిని హాస్టల్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు జీవనబీమా నగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆ విద్యార్థిని ముళబాగిలు కు చెందిన  భవ్య (19). ప్రైవేటు పీజీ హాస్టల్‌లో ఉంటూ కోరమంగల జ్యోతినివాస్‌ కాలేజీలో పస్ట్‌ ఇయర్‌ బీకాం చదువుతోంది. పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిందని శుక్రవారం కాలేజీ నుంచి డీబార్‌ చేశారు.

దీంతో తీవ్రంగా బాధపడిన భవ్య సాయంత్రం తన సోదరికి ఫోన్‌ చేసి తనను కాలేజీ నుంచి డీబార్‌ చేశారని, నేను ఇక బతకలేను అని చెప్పింది. తల్లిదండ్రులు భయపడి తిరిగి ఫోన్‌ చేయగా భవ్య స్పందించలేదు. దీంతో వారు బెంగళూరుకు బయల్దేరారు. కొంతసేపటికే ఆమె హాస్టల్‌ ఐదవ అంతస్తు నుంచి దూకడంతో మృత్యువాత పడింది. కుమార్తె మృతికి కాలేజీ పాలకమండలి కారణమని భవ్య తల్లిదండ్రులు జీవనబీమానగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు