బాగానే ఉన్నారు.. అంతలో ఏం జరిగిందో ఇలా చేసింది..

15 Oct, 2021 09:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, శ్రీకాకుళం: మండలంలోని భావనపాడు తీరంలో గురువారం ఓ యువతి ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి సమీపంలోని దవిడిగాం గ్రామానికి చెందిన సిరిపురం ఉచిత(21) అదే గ్రామానికి చెందిన పురుకొండ దుర్గాప్రసాద్‌ మధ్య ఎనిమిదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దుర్గాప్రసాద్‌కు ఐదేళ్ల క్రితమే వేరే యువతితో వివాహం జరిగి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

అయినా ఉచిత, దుర్గాప్రసాద్‌ మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో గురువారం భావనపాడు సముద్రతీరానికి ఇద్దరు ద్విచక్రవాహనంపై వచ్చారు. సముద్రస్నానం అనంతరం సమీప తోటకు వచ్చారు. ఇంతలో జరిగిందో  గానీ ఉచిత.. తన బ్యాగులో తీసుకువచ్చిన పురుగుల మందు తాగింది. ఒక్కసారిగా పెద్ద కేకలు పెట్టడంతో అక్కడికి సమీపంలో వలలు అల్లుతున్న మత్స్యకారులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

నౌపడ ఎస్సై సాయికుమార్‌ సంఘటన స్థలానికి చేరుకునే సరికే యువతి మృతిచెందింది. వివరాలను తెలుసుకొని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతురాలి తండ్రి వైజాగ్‌ ఆటో నగర్‌లో టైలరింగ్‌ పనిచేస్తూ కొంతకాలంగా కుటుంబంతో అక్కడే ఉన్నారు. దసరా సెలవులకు సొంత ఊరికి ఒంటరిగా వచ్చిన కుమార్తె.. తీరంలో శవమై పడి ఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

చదవండి: ఆంధ్రా అధికారిని ఘెరావ్‌ చేసిన ఒడిశా ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు