పెళ్లి సంబంధాలు రావడం లేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి..

12 Oct, 2021 08:18 IST|Sakshi

సాక్షి,మల్లాపూర్‌(హైదరాబాద్‌): ఆనారోగ్యం, పెళ్లి సంబంధాలు రావడం లేదని మనస్థాపంతో ఓయువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. నాచారం సీఐ కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం...ఓల్డ్‌ మల్లాపూర్‌కు చెందిన తొర్రి నర్సింహ కూతురు అశ్విని(29)  గత కొద్ది రోజుల నుంచి ఆనారోగ్యంతో బాధపడుతోంది. దీనికి తోడు పెళ్లి సంబంధాలు రావడం లేదని మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  తన చావుకు ఎవరు బాధ్యలు కారని ఆమె సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో..  
యువకుడి ఆత్మహత్య 
ఉప్పల్‌: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌ రాఘవేంద్రనగర్‌ కాలనీకి చెందిన వెంకటరామరాజు కుమారుడు కనకమూరి సుబ్బారాజు (30) ప్రైవేట్‌ ఉద్యోగి. యూఎస్‌ఏ నుంచి తిరిగివచ్చిన సుబ్బారాజు సంవత్సరం క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కొన్ని నెలలుగా ఇంటి దగ్గరే ఉంటూ మద్యానికి బానిసైనాడు. నెల రోజుల క్రితం మరోసారి రోడ్డు ప్రమాదం జరగడంతో మళ్లీ గాయపడ్డాడు.

ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన సుబ్బారాజు ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు. తెల్లవారుజామున ఎంతకీ తలుపు తెరవకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా ఉరి వేసుకుని మృతిచెంది ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: మోదీజీ నా చివరి కోరికలు తీర్చండి, ప్లీజ్.. అలా అయితేనే..

మరిన్ని వార్తలు