బాలిక కిడ్నాప్‌ డ్రామా 

28 Feb, 2021 07:21 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: సరిగా చదువుకోవడం లేదని తల్లిదండ్రులు తిడతారనే భయంతో ఓ బాలిక కిడ్నాప్‌ డ్రామా ఆడింది. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా యల్లాపురలో జరిగింది. టెన్త్‌ బాలిక తల్లి ఇటీవల ఉపాధ్యాయురాలికి ఫోన్‌ చేసి తన కుమార్తె హోం వర్క్‌ చేస్తోందా అని విచారించింది. ఈ మధ్య హోం వర్క్‌ సరిగా చేయడం లేదని టీచర్‌ బదులిచ్చింది. ఇది తెలిసి విద్యార్థిని శుక్రవారం సాయంత్రం స్కూల్‌ బస్సు దిగిన వెంటనే ఇంటికి వెళ్లకుండా దగ్గరలోనే  ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బైక్‌ వెళుతున్న శబ్ధం విని గట్టిగా కేకలు వేయసాగింది.

అప్పటికే తన కుమార్తె కనిపించలేదని తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వెతుకులాట ప్రారంభించారు. ఆ బైక్‌పై వెళుతున్న వ్యక్తి తల్లిదండ్రులకు ఎవరో అడవిలో అరుస్తున్న గొంతు వినపడిందని చెప్పడంతో అంతా వెళ్లి చూడగా కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న విద్యార్థిని కనిపించింది. ప్రశ్నించగా ఎవరో తనను కిడ్నాప్‌ చేశారని తెలిపింది. తల్లిదండ్రులు నిజమే అనుకున్నా, అనుమానంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించగా తానే ఈ నాటకమాడినట్లు గుట్టువిప్పింది. ఇంకోసారి ఇలా చేయవద్దని మందలించి పంపేశారు.
చదవండి:
పోలీసులు.. ఓ తాళిబొట్టు: అసలు ఏం జరిగిందంటే?   
భార్యను భయపెట్టాలని.. ఆసుపత్రి పాలై..

 

మరిన్ని వార్తలు