ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద బాలిక అనుమానాస్పద మృతి

20 Jun, 2021 08:57 IST|Sakshi

ఒంటికి నిప్పంటించుకొని బాలిక బలవన్మరణం

హైదరాబాద్‌ శివార్లలోని అన్నోజీగూడలో ఘటన  

ఘట్‌కేసర్‌: ఫోన్లో మాట్లాడొద్దని తల్లి మందలించడంతో వేదనకు గురైన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఘట్‌కేసర్‌ సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్‌ జిల్లా ఒంద్యాల్‌ గ్రామానికి చెందిన జమ్మికుంట విష్ణు, పద్మ దంపతుల కుమార్తె (16), కుమారుడితో కలసి అన్నోజీగూడ రాజీవ్‌ గృహకల్పలో నివసిస్తున్నారు. కొంతకాలంగా కూతురు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించి మందలించారు. బాలికలో మార్పు రాకపోగా శుక్రవారం తిరిగి అపరిచితునితో మాట్లాడుతుండటంతో గట్టిగా హెచ్చరించారు.

దీంతో వేదనకు గురైన బాలిక శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో వారు నిద్రించాక కిరోసిన్‌ సీసా తీసుకొని, కుటుంబ సభ్యులు బయటకు రాకుండా గడియపెట్టి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో అక్కడికక్కడే మరణించింది. ఉదయం వాకింగ్‌కు వచ్చిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి డాగ్, క్లూస్‌ టీంలు చేరుకొని ఆధారాలు సేకరించాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఖాళీ ప్రదేశంలో బాలిక మృతదేహం కనిపించడంతో దుండగులు బాలికను సజీవదహనం చేసి ఉండొచ్చనే వదంతులు వచ్చాయి. దీంతో స్థానికులు భారీగా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సమీపంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా బాలిక కిరోసిన్‌ సీసాతో ఒంటరిగా వెళ్లడం కనిపించింది. దీంతో పోలీసులు ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు.   

చదవండి: అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్‌?

మరిన్ని వార్తలు