బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్‌: తమ్ముడిని చంపి, స్టోర్‌రూంలో

15 Apr, 2021 11:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బాయ్‌ ఫ్రెండ్‌ చాటింగ్‌ వద్దన్నందుకు తమ్ముడి దారుణ హత్య

ఇయర్‌ ఫోన్స్‌ వైర్‌ బిగించి హత్య చేసి , స్టోర్‌రూంలో దాచి పెట్టిన వైనం

సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది.  బాయ్‌ ఫ్రెండ్‌తో  చాట్‌ చేయొద్దని వారించిన తమ్ముడిని అక్క(మైనర్‌ బాలిక )అమానుషంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయ్ బరేలి జిల్లాలో ఈ ఘటన  గత గురువారం చోటు చేసుకుంది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 15 ఏళ్ల బాలిక తన సోదరుడు (9)ని ఇయర్‌ఫోన్ కేబుల్‌ గొంతుకు బిగించి చంపేసింది. తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో బాయ్‌ ఫ్రెండ్‌తో అక్క ఫోన్‌లో చాట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. గంటలు గంటలు ఫోన్‌ ఎందుకు మాట్లాడతావంటూ గతంలో చాలాసార్లు అక్కను ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని అమ్మానాన్నకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతోవారు బాలికను మందలించారు. అయితే తాజాగా అదే తరహాలో ఫోన్‌లోమాట్లాడటం గుర్తించి వారించాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో అక్కపై దాడి చేశాడు. దీంతో ఆవేశంతో  ఊగిపోయిన బాలిక ఇయర్‌‌ ఫోన్స్‌ కేబుల్‌ను అతడి మెడకు బిగించడంతో ఊపరాడక చనిపోయాడు. ఆ తరువాత మృతదేహాన్ని గుట్టుగా  స్టోర్‌ రూంలో దాచి పెట్టి, ఏమీ తెలియనట్టుగా నటించింది.

అయితే పిల్లవాడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి తండ్రి పొరుగువారిపై  అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులను కూడా ఆరా తీయాలని భావించారు. మరుసటి రోజు, దుర్వాసన రావడంతో స్టోర్‌ రూం తెరిచి కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. చివరికి పోలీసుల విచారణలో బాలిక తన నేరాన్ని అంగీకరించింది. అయితే తనపై అమ్మా నాన్నకు పదే పదే ఫిర్యాదు చేయడంతో కోపం వచ్చిందని, కానీ తమ్ముడిని చంపాలని అనుకోలేదని పోలీసులతో వాపోయింది. సోమవారం సాయంత్రం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని రాయ్ బరేలి పోలీస్ సూపరింటెండెంట్ శ్లోక్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితురాలిని జువైనల్‌ హోంకు తరలించినట్టు  చెప్పారు.
 

మరిన్ని వార్తలు