Karnataka: యాక్సిడెంట్‌లో ప్రియుడు మృతి.. నువ్వే లేకుంటే నేనెందుకని..

16 May, 2022 06:56 IST|Sakshi

యువతి ఆత్మహత్య.. తుమకూరు జిల్లాలో విషాదం

తుమకూరు(బెంగళూరు): వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఇరు కుటుంబాల పెద్దలను కూడా ఒప్పించారు. కానీ విధిలీల మరోలా ఉంది. పెళ్లికి సిద్ధమయ్యేలోగా ప్రియుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ప్రియుడు లేని లోకం తనకు వద్దని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన తుమకూరు తాలూకాలోని ఆరేహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. యువతి ఆరేహళ్లివాసి సుష్మా (22), కాగా ప్రియుడు ధనుష్‌ (23). 

జాతరకు వస్తూ  
మస్కల్‌ గ్రామానికి చెందిన ధనుష్‌ బెంగళూరులో బట్టల షాపు పెట్టుకున్నాడు. సుష్మాతో పరిచయమై అది గాఢమైన ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకుని పెద్దగా చెప్పగా మొదట్లో తిరస్కరించారు. అయితే పట్టుబట్టి ఒప్పించారు. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకోవాల్సి ఉంది. ఈ నెల 11వ తేదీన  గ్రామంలో జరిగే జాతరలో పాల్గొనడానికి ధనుష్‌ బైక్‌పై వస్తుండగా నెలమంగల దగ్గర ఉన్న కులానహళి వద్ద యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయాడు. 

పురుగుల మందు తాగిన యువతి 
ప్రియుడి మరణ వార్త తెలిసిన సుష్మా తీవ్ర ఆవేదనకు లోనైంది. ప్రియుని ఆంత్యక్రియల్లో పాల్గొంది. ఆనాటి నుంచి తనలో తానే కుమిలిపోతూ ఉండింది. ఇక జీవించడం వృథా అని భావించి ఆ మరుసటిరోజు పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆమెను కాపాడుకోవాలని సుమారు నాలుగైదు ఆస్పత్రులకు మార్చారు కానీ ప్రయోజనం లేదు. ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచింది.

చదవండి: పెళ్లి చేసుకోవాలని అడగడంతో మంత్రి కుమారుడి నిజ స్వరూపం బట్టబయలు

మరిన్ని వార్తలు