అమ్మాయిని వెంటపడి వేధించారు

23 Feb, 2021 13:15 IST|Sakshi

పాట్నా: అబ్బాయితో కనిపించిందని ఓ అమ్మాయిని వెంటపడి వేధించారు కొందరు దుండగులు. తాము స్నేహితులమే అని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా బెదిరింపులతో పాటు దాడికి దిగారు. ఈ హేయమైన ఘటన బిహార్‌లోని గయాలో శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గయాలో స్కూల్‌ డ్రెస్‌లో ఉన్న ఓ అమ్మాయి తన స్నేహితుడితో కలిసి కబుర్లు చెప్పుకుంటోంది. ఇది చూసిన కొందరు దుండగులు వారిని తప్పుగా ఊహించుకున్నారు.

వారిని సమీపించి ఇక్కడేం చేస్తున్నారని నిలదీశారు. దీంతో తత్తరపాటుకు లోనైన ఆ అమ్మాయి తాము స్నేహితులమని చెప్పగా వారు వినిపించుకోలేదు. ఫ్రెండ్స్‌ అయితే మీకు ఇక్కడేం పని అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ చిత్రహింసలు పెట్టారు. మీ నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరింపులకు దిగారు. మమ్మల్ని వదిలేయండి, వెళ్లిపోతాం.. అని దీనంగా ప్రార్థించినప్పటికీ వారు చెవికెక్కించుకోకుండా చివరికి అన్నంత పనే చేశారు. వీడియో తీయొద్దని ఆ బాలిక చేతులెత్తి వేడుకున్నా కనికరించలేదు.

కనీసం ముఖం కప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే కూడా ఆమె దగ్గరున్న స్కార్ఫ్‌ను లాగేశారు. స్కార్ఫ్‌ ఇవ్వమని గింజుకున్నా పట్టించుకోకుండా శిలావిగ్రహాల్లా చూస్తూ నిలబడిపోయారు. ఆమె అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తే వెంటపడి మరీ లాక్కొచ్చారు. ఆమెతో పాటు ఆమె స్నేహితుడి మీద కూడా దాడికి దిగారు. పైగా ఆమె వివరాలు చెప్పమని బెదిరించడంతో ఆ బాలిక భయంభయంగానే తనది ఫతేపూర్‌ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా గయా ఎస్‌ఎస్‌పీ ఆదిత్య కుమార్‌ త్వరలోనే నిందితులను అరెస్ట్‌ చేస్తామని తెలిపారు.

చదవండి: దాబాకు వెళ్లి.. వెంటనే వచ్చేస్తామని చెప్పి

తస్మాత్‌ జాగ్రత్త: స్కూటీ ఇచ్చాడు, జైలుకెళ్లాడు

మరిన్ని వార్తలు