భార్య గురించి చెడుగా మాట్లాడినందుకు వియ్యంకుడి హత్య

29 Sep, 2021 11:25 IST|Sakshi

హతుడు రెవెన్యూశాఖ విశ్రాంత ఉద్యోగి

సాక్షి, అనంతపురం క్రైం: తన భార్య గురించి చెడుగా మాట్లాడిన వియ్యంకుడిని హతమార్చిన ఘటన అనంతపురం నగరంలో సంచలనం రేకెత్తించింది. ఒకటో పట్టణ సీఐ ప్రతాపరెడ్డి తెలిపిన మేరకు... నగరంలోని ఐదో రోడ్డుకు చెందిన గోగుల జగన్నాథ్‌(63).. రెవెన్యూ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రామ్మోహన్‌... నగరంలోని రాణి నగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్‌ ఇబ్రహీం ఖలీల్, నజీమా బేగం దంపతుల ఒక్కగానొక్క కుమార్తె ఖమర్‌తాజ్‌ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా రెండు కుటుంబాలు సంతోషంగా జీవిస్తూ వచ్చాయి. ఐదు నెలల క్రితం కోవిడ్‌ బారిన పడి జగన్నాథ్‌ భార్య మృతి చెందారు. ఇటీవల రెండో కుమారుడు శివకృష్ణకు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో అందరూ కలిసి రాణినగర్‌లోని వియ్యంకుడు ఇబ్రహీం ఖలీల్‌ ఇంటికి చేరుకున్నారు. 

చదవండి: (మూడేళ్ల ప్రేమ.. ఇంకొకరితో నిశ్చితార్థం జరగడంతో..)

ఈ నెల 27న (సోమవారం) ఇబ్రహీంను విడిగా కలిసి జగన్నాథ్‌ మాట్లాడాడు. నజీమా బేగం నడవడిక సరిగా లేదని విమర్శించాడు. తన భార్య గురించి చెడుగా మాట్లాడడంతో ఇబ్రహీం కోపోద్రిక్తుడయ్యాడు. అదే రోజు రాత్రి వియ్యంకులిద్దరూ ఒకే గదిలో నిద్రించారు. మంగళవారం వేకువజామున నిద్రలో ఉన్న జగన్నాథ్‌పై ఇబ్రహీం కత్తితో దాడి చేశాడు. ఛాతి, కడుపుపై విచక్షణారహితంగా పొడవడంతో జగన్నాథ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఇబ్రహీం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఉదయం నిద్ర లేచి కుటుంబీకులు చూడగా రక్తపు మడుగులో జగన్నాథ్‌ పడిఉన్నాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ వీర రాఘవరెడ్డి, వన్‌టౌన్‌ సీఐ ప్రతాపరెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.   

చదవండి:  (మరొకరితో పెళ్లి.. హైదరాబాద్‌కు వెళ్తూ ప్రియున్ని రమ్మని..) 

మరిన్ని వార్తలు