ప్రభుత్వ ఉద్యోగి దారుణహత్య..

19 Jul, 2021 14:56 IST|Sakshi
ఉత్తమ్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్సై

తలమడుగు(బోథ్‌): ప్రభుత్వ ఉద్యోగి దారుణహత్యకు గురైన సంఘటన మండలంలోని కుచులపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ పురుషోత్తంచారి వివరాల ప్రకారం... రాగి ఉత్తమ్‌(53) జిల్లా కేంద్రంలోని నీటి పారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లా డు. భోజనం అనంతరం రాత్రి పదున్న ర గంటలకు బయటకు వచ్చాడు. అదే సమయంలో అదును కోసం వేచిచూస్తున్న సుధాకర్‌ పాత కక్షల నేపథ్యంలో బండరాయితో ఉత్తమ్‌ తలపై కొట్టి హత్య చేశాడు.

అనంతరం అక్కడి నుంచి సుధాకర్‌ పారిపోయాడు. ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ పురుషోత్తంచారి, ఎస్సైలు దివ్య భారతి, ప్రవళిక వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. ఉత్తమ్‌కు భార్య చంద్రకళ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

నిందితుడి పట్టివేత...
హత్య చేసి పారిపోయిన నిందితుడు సుధాకర్‌ను పట్టుకున్నట్లు ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో సీఐ వెల్లడించారు. ఉత్తమ్‌ని అదే గ్రామానికి చెందిన మందాడి సుధాకర్‌ పాత కక్షల నేపథ్యంలో హత్య చేయడానికి కుట్ర పన్నాడని, శనివారం రాత్రి ఒంటరిగా ఇంటి బయట కనిపించిన ఉత్తమ్‌ను బండరాయితో తలపై కొట్టి హత్య చేసి పారిపోయాడని తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు సుధాకర్‌ను అతడి పంట పొలంలో పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు