మనవడి వేధింపులు తాళలేక వృద్ధుడి ఆత్మహత్య

4 Aug, 2021 08:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చంద్రగిరి : మద్యం కోసం మనుమడు వేధింపులను తట్టుకోలేక తాత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం మండలంలోని కొత్తశానంబట్లలో చోటు చేసుకుంది. మృతుని బంధువుల కథనం..గ్రామానికి చెందిన చిన్నబ్బరెడ్డి (72), గోవిందమ్మ దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్నబ్బరెడ్డి దంపతులు తన మనమడితో కలసి అదే గ్రామంలో వేరే కాపురం ఉంటున్నారు. మద్యానికి బానిసైన మనుమడు తరచూ తన తాతను డబ్బులు కోసం వేధించేవాడు. ఈ క్రమంలో రెండు రోజులుగా చిన్నబ్బరెడ్డితో తీవ్రంగా గొడవ పడ్డాడు. దీంతో ఆయన జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లోని ఫ్యాను కొక్కీకి ఉరివేసుకుని మృతి చెందాడు. వృద్ధుని కుటుంబ సభ్యులు ఆగమేఘాలపై అంత్యక్రియలను పూర్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

మరిన్ని వార్తలు