విషాదం: మనవడిని కాపాడబోయి..

20 Jun, 2021 21:19 IST|Sakshi

సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో మనవడు పడిపోగా కాపాడబోయి తాత కూడా మృతి చెందిన ఘటన మహా ముత్తరాం మండలం బోర్లగూడెం నర్సింగాపూర్ శివారులో జరిగింది. స్థానికుల కథనం.. ప్రకారం మృతులు భీముని భూమయ్య (58), భీముని రిషీ (10) నర్సింగాపూర్ కు వెళ్లి వస్తుండగా చెరువు వెనుక ఉన్న వారి పొలానికి వెళ్తూ నీటిలో నుంచి చెరువు దాటే ప్రయత్నం లో మనువడు ఒక్కసారిగా నీట మునిగిపోయాడు. 

దీంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో భూమయ్య కూడా నీటమునిగి మృత్యువాత పడ్డాడు. చెరువు మరమ్మతులో భాగంగా గత నెలలో జేసీబీలతో మట్టిని తవ్వడం వల్ల లోతైన గుంటలు ఏర్పడంతో నే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నిత్యం అదే చెరువులో చేపలు పడుతూ గత 25 సంవత్సరాలుగా చెరువు కట్టపైనే మంచెవేసుకుని ఉండే భూమయ్య కు ఆ చెరువులో ఎక్కడ లోతు ఉందో ఎక్కడ ఏముందో తెలిసిన అతను నీటిలో మునిగి మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భూమయ్య కొడుకు రవి గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబానికి 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

చదవండి: 16 ఏళ్ల నిర్లక్ష్యం.. పోయిన ప్రాణం

మరిన్ని వార్తలు