నందిని చూపించి.. నామం పెట్టారు 

14 Mar, 2021 15:40 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

భువనేశ్వర్‌ : ఇంట్లో ఉన్న భూతాన్ని శివుడి వాహనం నంది(ఎద్దు)తో తరిమి వేస్తామని చెప్పి, ఓ వివాహితను నట్టేట ముంచింది దుండగుల ముఠా. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నంది సాయంతో జాతకం చెబుతామంటూ మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తుల ముఠా జిల్లా కేంద్రానికి వచ్చారు. ఇదే పేరుతో పలు కాలనీల్లో కలియ తిరుగుతూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అదే తరహాలో మహేశ్వర కాలనీకి చెందిన మార్వాడీ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో మగవారు ఎవరూ లేకపోగా.. మార్వాడీ భార్య పింకీ సూరానాతో మాట్లాడి, మీ ఇంట్లో భూతం ఉందని నమ్మించారు. ఆ కారణంతోనే అశాంతి నెలకొందని, రూ.50 వేలు ఇస్తే నంది సాయంతో భూతాన్ని తరిమేస్తానని నమ్మించాడు.

పూజ చేయాలని డబ్బు తీసుకొని, సామగ్రి కోసం బయటకు వెళ్లి, తిరిగి రాకుండా పరారయ్యారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. తన భర్తకు విషయం చేరవేసింది. దీనిపై మల్కన్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పట్టణ శివారులో మహారాష్ట్రాకు చెందిన నలుగురు నిందితుల ముఠా తోపాటు నందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మూగజీవాన్ని జిల్లా కేంద్రంలోని గోశాలకు తరలించారు. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు