గుడివాడ టూ టౌన్‌ ఎస్సై బలవన్మరణం

19 Jan, 2021 08:35 IST|Sakshi

సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. గుడివాడ టూ టౌన్‌ ఎస్‌ఐ పిల్లి  విజయ్‌కుమార్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని విజయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారని పోలీస్‌ వర్గాలు తెలిపాయి. విజయ్‌కుమార్ మృతికి వివాహేతర సంబంధమే కారణమంటూ సహచర సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడికి రెండు నెలల కిందటే వివాహమైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన విజయ్ కుమార్ 2012 బ్యాచ్ ఎస్సై. హనుమాన్ జంక్షన్‌లో తొలి బాధ్యతలు చేపట్టాడు.

అయితే నూజివీడుకు చెందిన బ్యూటీషియన్‌తో‌ వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలతో విజయ్ కుమార్ అప్పట్లో సస్పెండయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి విధుల్లో చేరిన విజయ్కుమార్ గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఏలూరుకు చెందిన మహిళతో మూడు నెలల కిందట వివాహమైంది. భార్యను కాపురానికి తీసుకురాకుండా బ్యూటీషియన్‌తో  కలిసి ఆయన ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. బ్యూటిషన్ ఒత్తిడి వల్లే విజయ్ కుమార్ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విజయ్ కుమార్  మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయ్కుమార్ మరణవార్త తెలుసుకున్న సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది, ఏరియా ఆసుపత్రికి చేరుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు.

మరిన్ని వార్తలు