భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని ప్రియురాలి హత్య

26 Jul, 2021 11:50 IST|Sakshi
నిందితుడు అజయ్‌ దేశాయ్‌, హత్యకు గురైన ప్రియురాలు స్వీటి పాటిల్‌ (ఫైల్‌ ఫోటో)

గుజరాత్‌లో వెలుగు చూసిన దారుణం

పెళ్లి చేసుకోమని కోరడంతో ప్రియురాలిని హత్య చేసిన పోలీసు అధికారి

గాంధీనగర్‌/అహ్మదాబాద్‌: అతడు పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. వివాహమయి భార్య ఉంది. అయినప్పటికి మరో మహిళను ప్రేమించానన్నాడు.. ఆమెతో కలిసి సహజీవనం చేయసాగాడు. కానీ ప్రియురాలు అతడిని భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయసాగింది. భార్యకు విడాకులు ఇస్తే.. ఆమెకు భరణంగా భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని భావించి ప్రియురాలిని హత్య చేశాడు. గుజరాత్‌, అహ్మదాబాద్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలు..

అహ్మదాబాద్‌కు చెందిన అజయ్‌ దేశాయ్‌ పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో 2017లో అతడికి వివాహం అయ్యింది. ఆ తర్వాత కొద్ది రోజులకు అతడికి స్వీటి పాటిల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరు సహజీవనం చేయసాగారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా స్వీటి ఒత్తిడి చేయడంతో ఏడాది క్రితం అజయ్‌ ఓ గుడిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. 

కానీ స్వీటి మాత్రం తన వివాహం చట్టబద్దం చేసుకోవాలని భావించింది. దాని కోసం అజయ్‌ను అతడి భార్యకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేయసాగింది స్వీటి. ఈ విషయంపై ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. స్వీటి కోరినట్లు భార్యకు విడాకులు ఇస్తే.. భరణంగా ఆమెకు 25 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అంత డబ్బు ఇవ్వడం ఇష్టం లేని అజయ్‌.. స్వీటిని అడ్డు తొలగించుకోవాలని భావించాడు. 

ఈ క్రమంలో జూన్‌ 4న ఇదే విషయం మీద స్వీటి-అజయ్‌ల మధ్య ప్రారంభమైన గొడవ ముదిరింది. ఆ కోపంలో అజయ్‌.. స్వీటిని చంపేయాలని భావించాడు. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత స్వీటి మృతదేహాన్ని తన స్నేహితుడు కిరిట్సింగ్ జడేజాకి చెందిన హోటల్‌ ప్రాంగణంలో పూడ్చి పెట్టాడు. ఇక జూన్‌ 5న స్వీటి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణలో అజయ్‌ చేసిన దారుణం వెలుగు చూసింది. ప్రసుత్తం అజయ్‌ వడోదర పోలీసులు కస్టడీలో ఉన్నాడు. 

మరిన్ని వార్తలు