స్పెల్లింగ్స్‌ నేర్పించే నెపంతో బాలికలను గదిలోకి పిలిపించుకుని..

4 Oct, 2021 21:21 IST|Sakshi

గాంధీనగర్‌: విద్య కోసం బాలికలను పాఠశాలకు పంపుతుంటే అక్కడ కూడా వారికి వేధింపులు తప్పట్లేదు.స్పెల్లింగులు నేర్పిస్తానని చెప్పి ఓ స్కూల్‌ డైరెక్టర్‌ ఇద్దరు విద్యార్థులను తన గదికి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. లోధిక తాలుకాలోని ఓ స్కూల్ డైరెక్టర్‌గా పని చేస్తున్న దినేశ్ జోషి కొన్ని రోజుల క్రితం స్పెల్లింగులు నేర్పించే నెపంతో ఇద్దరు బాలికలను తన రూమ్‌కి రమ్మనాడు. అతని పాడు బుద్ధి తెలియని ఆ బాలికలు గదిలోకి వెళ్లగానే జోషి వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. 

ఈ విషయం గురించి ఓ బాధిత బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. వీరిద్దరే గాక అతని ప్రవర్తన అందరి అమ్మాయిలతో ఇలానే ఉండేది. దీంతో ఈ విషయం బయటకు రాగానే ఇతర విద్యార్థుల కూడా వారి తల్లిదండ్రులకు గతంలో తమపై జరిగిన వాటి గురించి చెప్పారు. దీంతో దాదాపు వందమంది తల్లిదండ్రులు లోధిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జోషిపై ఫిర్యాదు చేశారు. నిందితుడు జోషి భార్య సీమా జోషి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు. 

తన భర్తపై ఫిర్యాదు విషయం తెలుసుకున్న ఆమె బీజేపీ రాజ్‌కోట్ జిల్లా మాజీ అధ్యక్షుడు బీకే సత్యతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వీరిద్దరు కలిసి బాధిత బాలికల తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో జోషిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు నిందితుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు.

చదవండి: Crowbar Man: 35 ఏళ్లుగా.. 500 దొంగతనాలు.. రూ.5 కోట్లతో ఏంజాయ్‌

మరిన్ని వార్తలు