ఇంట్లోకి చొరబడి కాల్పులు.. ఐదేళ్ల చిన్నారితో సహా..

13 Aug, 2021 08:37 IST|Sakshi
సంఘటన జరిగిన ప్రదేశం, (ఇన్‌సెట్‌లో) నిందితుడు జేక్‌ డావిన్‌సన్‌

లండన్‌ : ఇంగ్లాండ్‌లోని ప్లైమౌత్‌ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కొంతమందిపై విచక్షణా రహితంగా తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన  గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జేక్‌ డావిన్‌సన్‌ అనే వ్యక్తి నిన్న సాయంత్రం కీహామ్‌ ఏరియాలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి లోపలున్న వారిపై కాల్పులు జరిపాడు. అనంతరం ఇంటి బయటకు వచ్చి అక్కడి ఓ పార్కులోకి ప్రవేశించాడు. పెంపుడు కుక్కలతో తిరిగుతున్న వారిపై కూడా కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో జేక్‌తో సహా మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డారు. వీరిలో ఓ మహిళ, ఐదు సంవత్సరాల చిన్నారి, ముగ్గురు పురుషులు సంఘటనా స్థలంలోనే చనిపోగా.. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

సంఘటనా స్థలం వద్ద పోలీసులు

తుపాకి గుళ్ల చప్పుడు, బాధితుల ఆర్తనాదాలు విన్న స్థానికులు డెవాన్‌ అండ్‌ కార్న్‌వాల్‌ పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇది ఉగ్రవాదుల పని కాదని వారు స్పష్టం చేశారు. కాల్పులకు తెగబడ్డ వ్యక్తికి చనిపోయిన వారికి సంబంధం ఏంటా అన్న కోణంలో విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు