ఏం జరిగిందో ఏమో.. యువతి అనుమానాస్పద మృతి

10 May, 2021 08:37 IST|Sakshi
హేమవర్ష మృతదేహం 

పొన్నూరు(గుంటూరు జిల్లా): పొన్నపల్లి హేమవర్ష (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని ఆరో వార్డుకు చెందిన మురళీకృష్ణ కుమారై హేమవర్ష హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. హేమవర్ష చిన్నతనంలోనే తల్లిదండ్రులు (మురళీకృష్ణ, పద్మావతి) మృతి చెందారు. అప్పటి నుంచి మేనమామలైన శ్రీనివాసప్రసాద్, ప్రసాద్‌ వద్దనే పెరిగింది. ఏడాదిన్నర నుంచి హైదరాబాద్‌లో మాదాపూర్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.

ఈ నెల 7వ తేదీ కూడా హేమవర్ష మేనమామలతో ఫోన్‌లో మాట్లాడింది. 8వ తేదీ శేఖర్‌ అనే యువకుడు శ్రీనివాసప్రసాద్‌కు  ఫోన్‌ చేసి హేమవర్ష మృతి చెందిందని తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఉన్న బంధువులతో మాట్లాడి అక్కడ ఏమి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఆ యువకుడు అంబులెన్స్‌ మాట్లాడుకుని శనివారం అర్ధరాత్రి మృతదేహాన్ని పొన్నూరు తీసుకువచ్చాడు. దీంతో బంధువులు ఆదివారం ఆ యువకుడిపై అనుమానం ఉందని పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హేమవర్ష మేనమామ శ్రీనివాస ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పూర్తి దర్యాప్తు కోసం హైదరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు కేసును బదలాయిస్తామని పట్టణ సీఐ శరత్‌బాబు తెలిపారు.

చదవండి: ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న కరోనా 
అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు  

మరిన్ని వార్తలు