సోదరుడి భార్య ప్రసవించిందని.. 13 ఏళ్ల బాలికను సాయంగా పంపిస్తే..

1 Sep, 2021 08:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గుర్‌గావ్‌లో దళిత బాలికపై హత్యాచారం

గుర్‌గావ్‌: ఢిల్లీలోని నరేలా ప్రాంతానికి చెందిన దళిత బాలిక(13) పొరుగునే ఉన్న గుర్‌గావ్‌లో అత్యాచారం, హత్యకు గురైంది. ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తమ కుమార్తె దహన సంస్కారాలు వెంటనే పూర్తి చేయాలంటూ యజమాని బంధువు తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ మృతురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది.

‘సోదరుడి భార్య ప్రసవించడంతో సాయం చేయడానికంటూ మా యజమానురాలు నా కుమార్తెను జూలై 17న గుర్‌గావ్‌కు పంపారు. నా కుమార్తె చనిపోయిందంటూ ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం  మా యజమాని నాకు ఫోన్‌ చేసి చెప్పారు. రాత్రి 7 గంటల సమయంలో మృతదేహాన్ని నరేలాలోని మా ఇంటికి తీసుకువచ్చారు. వెంటనే దహనసంస్కారాలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేశారు’అని బాలిక తండ్రి పోలీసులకు తెలిపారు. యజమానురాలి సోదరుడు ప్రవీణ్‌ వర్మ, ఇతరులు కలిసి తన కుమార్తెను చంపారని ఆరోపించారు.

ఈ మేరకు స్పందించిన పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం చేయించారు. హత్యకు ముందు బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలడంతో గుర్‌గావ్‌ పోలీసులు వివిధ సెక్షన్లతోపాటు ఎస్‌సీ/ఎస్‌టీ చట్టం కింద కేసులు నమోదు చేసి ప్రవీణ్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా, ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపించి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత ఆధిర్‌ రంజన్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. ఆగస్టు మొదటి వారంలో ఢిల్లీ కంటోన్మెంట్‌ ప్రాంతానికి చెందిన తొమ్మిదేళ్ల దళిత బాలిక అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే.

చదవండి: మహిళపై రెచ్చిపోయిన ఉన్మాది,15 కత్తి పోట్లు, చివరికి.. 

మరిన్ని వార్తలు