గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధ్యాయుడు

21 Feb, 2021 14:35 IST|Sakshi
మహ్మద్‌ ఖలీల్‌ హైమద్‌ (ఫైల్‌)

అనంతగిరి: గుండెపోటుతో గురుకుల ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా వోట్కూర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ ఖలీల్‌ హైమద్‌(38) వికారాబాద్‌ పట్టణం శివారెడ్డిపేట సమీపంలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో గత నవంబర్‌ నుంచి ఉర్దూ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు కొడంగల్‌ గురుకుల పాఠశాలలో పనిచేశారు.

విధుల్లో భాగంగా ప్రతిరోజు రాత్రి ఓ ఉపాధ్యాయుడు డ్యూటీ చేస్తారు. హైమద్‌ శుక్రవారం రాత్రి  9.30 గంటల ప్రాంతంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కొద్దిసేపు తర్వాత బాత్రూంకు వెళ్లారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో సెక్యూరిటీ గార్డు సహాయంతో తలుపులు విరగ్గొట్టి చూడగా ఉపాధ్యాయుడు కుప్పకూలి ఉన్నారు. వెంటనే విషయాన్ని ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇచ్చారు. 108లో వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందారని తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చదవండి:
ప్రేమించి పెళ్లాడిన భర్తను చంపిన భార్య
బౌన్స్‌ స్కూటీల దొంగ అరెస్ట్‌ 

మరిన్ని వార్తలు