అర్ధరాత్రి సగం కాలిపోయిన డెడ్‌ బాడీ కలకలం.. నికితా చౌదరికి ఏమైంది..?

17 Mar, 2022 14:41 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశంలో రోజురోజుకు యువతులు, మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. దాడులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా కొందరు మృగాలు మాత్రం మారడం లేదు. తాజాగా మహారాష్ట్రలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. నాగపూర్‌లో సగం కాలిపోయిన యువతి నికితా చౌదరి(22) మృతదేహం కలకలం సృష్టించింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబర్డి ప్రాంతంలోని ఓ నిర్మానుష‍్య ప్రాంతంలో బుధవారం రాత్రి మంటల్లో సగం కాలిపోయిన నికితా చౌదరి మృతదేహాన్ని గుర్తించినట్టు తెలిపారు. కాగా, సదరు యువతి కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం  వాడి పోలీస్‌ స్టేషన్‌లో కేసు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. అయితే నికితా చౌదరి మృతదేహంలో లభ్యమైన ప్రాంతంలో ఖాళీ పెట్రోల్‌ సీసాలు కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

అయితే,  రాణాప్రతాప్‌నగర్‌కు చెందిన నికితా చౌదరి.. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రోజు వారీ లాగే ఆమె మంగళవారం ఆఫీసుకు వెళ్లి తిరిగిరాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో ఆమె మృతదేహం ఇలా బయట పడింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. బాధితురాలిపై లైంగిక దాడి చేసిన అనంతరం ఇలా చేశారా లేక ఇక్కడే ఆమెను చంపేశారా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు