నడిరోడ్డుపై యువతి దారుణ హత్య : షాకింగ్ వీడియో

27 Oct, 2020 14:21 IST|Sakshi

ఫరీదాబాద్ : మహిళలు, యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలకు, దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా హరియాణలో జరిగిన దారుణ ఘటన మహిళల భద్రతను సవాల్ చేస్తోంది. మతం మారేందుకు నిరాకరించిందన్న ఆగ్రహంతో ఒక యువతిని నడిరోడ్డుపై కాల్చి చంపిన వైనం తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. నిఖిత (21) పరీక్ష రాసి వస్తుండగా, మాటు వేసిన ఇద్దరు దుర్మార్గులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి  అక్కడినుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డయ్యాయి.  ఈ దారుణ హత్యకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.  

బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి నిఖితను కారులో ఆమెను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు. నిఖిత పరీక్ష రాసి బయటికి వస్తుండగా బాధితురాలి స్నేహితుడుగా భావిస్తున్న తౌసీఫ్ ఎటాక్ చేశాడు. మొదట కారులో ఆమెను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు. దీన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిఖిత కిడ్నాప్ యత్నం, ఆమె ప్రతిఘటన, కారులోంచి దిగిన నిందితుడు తన రివాల్వర్‌ను బయటకు తీసి కాల్పులు జరపడం, బాధితురాలు కుప్పకూలిన విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. హరియాణలోని ఫరీదాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై భారీ ఆగ్రహం చెలరేగింది. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు తౌసీఫ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

ఇస్లాం మతంలోకి మారమని తౌసీఫ్ తమ కుమార్తెపై ఒత్తిడి తెచ్చాడని, నిరాకరించడంతోనే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలో నిందితుడిపై ఫిర్యాదు కూడా చేశామని బాధితురాలి తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. 

మరిన్ని వార్తలు