బాలుడిని కిడ్నాప్​ చేసిన టీచర్​..

8 Jun, 2021 14:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చండీఘడ్‌: కరోనా పుణ్యాన అంతా ఆన్‌లైన్‌మయం అయిపోయింది. పిల్లలు బడికి వెళ్లడం మానేసి అరచేతిలోనే ఆన్‌లైన్‌ పాఠాలు నేర్చుకుంటున్నారు. మరికొందరు ట్యూషన్‌ టీచర్ల ద్వారా పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ట్యూషన్‌ టీచర్‌ విద్యార్థిని తీసుకుని పారిపోయిన ఘటన చండీఘడ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది..

పానిపట్‌కు చెందిన ఓ కుటుంబం, తమ 17 ఏళ్ల కుమారునికి ట్యూషన్​ చెప్పడానికి 20 ఏళ్ల వయసున్న మహిళా టీచర్​ను నియమించింది. ఆమె గత మూడు నెలల నుంచి నిత్యం ఆమె ఇంటిలో అతడికి ట్యూషన్‌ చెబుతోంది. ప్రతి రోజు నాలుగు గంటల పాటు అతడికి పాఠాలు నేర్పించేది. ఈ క్రమంలో గత నెల 29న అతడు తమ ఇంటికి సమీపంలోని దేస్రాజ్​ కాలనీలో ఉంటున్న టీచర్​ ఇంటికి వెళ్లాడు.  రాత్రి అయినా కూడా అతడు ఇంటికి తిరిగి రాకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

కొడుకుకు ఎన్నిసార్లు ఫోన్​ చేసినా స్విచ్చాఫ్​ వచ్చింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు కంగారుగా సదరు టీచర్​ ఇంటికి చేరుకుని కుమారుడి కోసం వాకబు చేశారు. కానీ తమ కూతురు కూడా కనిపించడం లేదంటూ టీచర్‌ కుటుంబ సభ్యులు సమాధానమిచ్చారు. దీంతో ఆ టీచర్​పై మైనర్‌ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆ టీచర్​పై కిడ్నాప్​ కేసు నమోదు చేశామని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీస్​ అధికారి రాణా ప్రతాప్​ తెలిపారు. ఆ టీచర్‌కు ఇదివరకే పెళ్లవగా విడాకులు కూడా తీసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో తెలిసింది. ఇక వారిద్దరు ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు ఎలాంటి విలువైన వస్తువులు తీసుకెళ్లలేదని పోలీసులు పేర్కొన్నారు..

చదవండి: కలెక్టర్​ ఎమోషనల్​: ఇంటి బిడ్డగా చూసుకున్నారు 

మరిన్ని వార్తలు