విషాదంగా ప్రేమ పెళ్లి.. ఇంటి నుంచి వెళ్లిపోయి..

23 Apr, 2022 12:52 IST|Sakshi
లలిత (ఫైల్‌), నిఖిలేశ్వర్‌  

ఏడాది తిరగకముందే వివాహిత ఆత్మహత్య 

చెరువులో శవమై తేలిన వివాహిత

ఇంటి నుంచి పారిపోయిన భర్త

సాక్షి, హసన్‌పర్తి: ప్రేమ పెళ్లి విఫలమైంది. రెండేళ్ల పాటు ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబంలో నెలకొన్న గొడవలు భరించలేక ఆ వివాహిత తనువు చాలించింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆమె గురువారం వడ్డెపల్లి చెరువులో శవంగా లభ్యమైంది. అంతకుముందు భార్య ఆచూకీ లభ్యం కాకపోవడంతో భర్త కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

వివరాలు.. నగరంలోని 56వ డివిజన్‌ గోపాలపురానికి చెందిన నిఖిలేశ్వర్, హనుమకొండ కాపువాడకు చెందిన లలిత(23) ఇంటర్మీడియట్‌ చదువుతున్న క్రమంలో ప్రేమలొ పడ్డారు. కులాలు వేరు కావడంతో కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నిఖిలేశ్వర్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

భార్యపై అనుమానం..
కాగా, కొంతకాలంగా భార్య లలితపై నిఖిలేశ్వర్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నాడని బాధిత కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. కుటుంబంలో నెలకొన్న గొడవలు భరించలేక ఈనెల 20న లలిత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో గాలించారు. భార్య ఆచూకీ లభ్యం కాకపోవడంతో నిఖిలేశ్వర్‌ మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో గురువారం ఉదయం తాను చనిపోతానని లేఖ రాసి వెళ్లిపోయాడు. బైక్, సెల్‌ఫోన్‌ ఇంట్లోనే ఉన్నాయి. 

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు..
కాగా, కొడుకు, కోడలు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆందోళనకు గురైన తల్లి యాదలక్ష్మి గురువారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

చెరువులో తేలిన మృతదేహం..
ఇదిలా ఉండగా, లలిత మృతదేహం గురువారమే వడ్డెపల్లి చెరువులో లభ్యమైంది. అయితే గుర్తు తెలియని మృతదేహంగా ఎంజీఎంలో కాజీపేట పోలీసులు భద్రపరిచారు. శుక్రవారం ఆ మృతదేహం లలితదిగా కుటుంబసభ్యులు గుర్తించారు. అయితే ఇప్పటివరకు నిఖిలేశ్వర్‌ ఆచూకీ లభ్యం కాలేదు.

►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు