రాజేష్‌ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. వివాహేతర సంబంధం.. బలవంతంగా సుజాతకు విషం?

30 May, 2023 10:31 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: హయత్‌నగర్‌లో దారుణంగా హత్యకు గురైన రాజేష్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. సుజాతతో వివాహేతర సంబంధం కారణంగానే.. ఆమె భర్త రాజేష్‌ను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఈలోపు నాగేశ్వర్‌రావు పెద్ద ట్విస్టే ఇచ్చాడు. తన భార్యది సూసైడ్‌ కాదని.. రాజేష్‌ చంపాడంటూ సాక్షి టీవీతో చెప్పాడు.

‘‘నా భార్యను రాజేషే చంపాడు. విషం తెచ్చి బలవంతంగా నా భార్యకు తాగించాడు. నేను కానీ.. నా కొడుకులు కానీ రాజేష్‌ను కొట్టలేదు. కొన్ని నెలలుగా నా భార్యను రాజేష్‌ టార్చర్‌ పెడుతున్నాడు’’ అని సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడాయన.   

ఇదిలా ఉంటే ఈ కేసులో వివాహేతర సంబంధమే రాజేష్‌ హత్యకు కారణమనే విషయాన్ని పోలీసులు దాదాపుగా ధృవీకరించుకున్నారు. ప్రభుత్వ టీచర్‌ అయిన సుజాతతో రాజేష్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పురుగుల మందు తాగిందని పేర్కొంటూ.. ఈ నెల 24వ తేదీన సుజాతను ఆస్పత్రిలో చేర్పించాడు నాగేశ్వరరావు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్నుమూసింది. 

అయితే ఆమె విషం తాగిందని చెబుతున్న సమయానికి ముందు ఆమె ఇంటి వద్ద రాజేష్‌ కనిపించాడని, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది. మరోవైపు రాకేష్‌ హత్య కేసులో హయత్‌నగర్‌ పోలీసులు నాగేశ్వర్‌రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేష్‌ను నాగేశ్వరరావు కొట్టి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు