నాగరాజు రెండో లాకర్‌లో భారీగా బంగారం

23 Oct, 2020 01:57 IST|Sakshi

మరో లాకర్‌లో 35 వెండి బిస్కట్లు

సాక్షి, హైదరాబాద్‌: కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు బినామీ ఖాతాలో భారీగా బంగారం బయటపడింది. నాగరాజు బినామీ అయిన అల్వాల్‌కు చెందిన నందగోపాల్‌ అనే వ్యక్తి ఇంటిపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో నందగోపాల్‌ పేరిట అల్వాల్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ఒక లాకర్, పీజే మహేందర్‌ కుమార్‌ పేరిట మేడ్చల్‌లోని ఐసీఐసీఐ బ్రాంచ్‌లో మరో లాకర్‌ను కూడా నాగరాజు, అతని భార్య స్వప్న వాడుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ లాకర్లను గురువారం అధికారులు తెరవగా నందగోపాల్‌ పేరిట ఉన్న లాకర్‌లో రూ.60 లక్షల విలువైన ఒక కిలో 250 గ్రాముల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. నాగరాజుకు సంబంధించి ఇది రెండో లాకర్‌ కాగా, మూడో లాకర్‌లో రూ.4.5 లక్షల విలువచేసే 7.29 కిలోల బరువున్న 35 వెండిబిస్కట్లు బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మొదటి లాకర్‌ అల్వాల్‌లోని సౌత్‌ ఇండియన్‌ బ్యాంకులో నాగరాజు సమీప బంధువు నరేందర్‌ పేరిట ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. సెప్టెంబర్‌ 2న ఈ లాకర్‌ను తెరిచిన ఏసీబీ రూ.57.6 లక్షల విలువ చేసే కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు