ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

30 Jul, 2021 12:17 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ముజఫర్‌నగర్‌లోని ఒక భవనం కుప్పకూలింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ దుర్ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కాగా, ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు.. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

అయితే, వీరిని పరీక్షించిన వైద్యులు ప్రమాద స్థలంలోనే ముగ్గురు చనిపోయినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వారిని జుబేదా(35), మీనా(65), అలీశాలుగా గుర్తించారు. అదే విధంగా గాయపడిన మరో నలుగురిని ఇంతియాస్‌ (45),సైరా(40), నగ్మా(21), పర్వేజ్‌లుగా గుర్తించించామని తెలిపారు. వీరికి అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్నయూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు