హేమంత్ హత్య కేసు: కీలకంగా మారిన ట్రావెల్స్ హిస్టరీ..

26 Sep, 2020 16:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిందితుల చేతిలో దారుణ హత్యకు గురైన హేమంత్ కేసులో పూటకో విషయం బయటపడుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుల ట్రావెల్స్ హిస్టరీ కీలకంగా మారుతోంది. చందానగర్‌లోని అవంతి ఇంటి దగ్గర నుంచి హత్య అనంతరం హైదరాబాద్‌కు వచ్చే వరకు చోటుచేసుకున్న ట్రావెల్స్ హిస్టరీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. అయితే నిందితుల ట్రావెల్ హిస్టరీపైన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. చందా నగర్‌లోని లక్ష్మారెడ్డి ఇంటి నుంచి మూడు కార్లలో నిందితులు బయల్దేరితే అవంతి తండ్రి లక్ష్మారెడ్డి హోండా షైన్ వెహికల్‌పై బయలుదేరారు. తర్వాత రెండు గంటల నలభై నిమిషాలకు చందానగర్ నుంచి బయలుదేరిన నిందితులు.. 40 నిమిషాలు ట్రావెల్ చేసి గచ్చిబౌలిలోని అవంతి ఇంటికి చేరుకున్నారు. చదవండి:  (వాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయండి: అవంతి)

ఇంట్లో ఉన్న అవంతి, హేమంత్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకొని 15 నిమిషాల్లో గోపనపల్లి చౌరస్తాకు చేరుకున్నారు. గోపన్‌పల్లి చౌరస్తాలో అవంతిని కిందకు దింపి వేసిన నిందితులు.. హేమంత్‌తో మాట్లాడి పంపిస్తాను అంటూ యుగేంధర్‌ అలాగే కారులో తీసుకెళ్లారు. యుగేంధర్‌తోపాటు అప్పటికే కారులో ఉన్న కిరాయి హంతకులు.యాదవ్, రాజు, పాషా ఉన్నారు. వీరంతా కలిసి ఒకే కారులో జహీరాబాద్‌ వైపు పయనించారు. ఈ సమయంలో కిరాయి హంతకులు హేమంత్‌ను పలుమార్లు బెదిరించారు. అవంతిని వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే అవంతిని వదిలి పెట్టేందుకు హేమంత్‌ ఒప్పుకోలేదు. ఈ క్రమంలో జహీరాబాద్ వద్ద మద్యంతో పాటు తాల్లు తీసుకున్న యుగేంధర్ 7:30కు సంగారెడ్డి సమీపానికి చేరుకున్నారు. చదవండి: (హేమంత్ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు)

కారులోనే హేమంత్‌ కాళ్లు చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేశారు. 7:30 ప్రాంతంలో నీకు ప్రేమ, పెళ్లి ఎందుకని బెదిరించిన యుగేంధర్‌ హేమంత్‌ను ఉరివేసి చంపేశాడు. అనంతరం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ముత్తంగి సమీపంలోని దేవాలయం వద్ద మద్యం సేవించారు. 1:30 కు సంగారెడ్డిలోని మిత్రుల వద్ద భోజనం చేశారు. అఖరుకి 2:30కు యుగేంధర్‌ పోలీసులకు చిక్కారు. ఇదిలా ఉండగా కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడంనచ్చని అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన హేమంత్‌ని హత్య చేయించారు. సంగారెడ్డి ప్రాంతంలో గురువారం రాత్రి హేమంత్‌ హత్య చోటుచేసుకుంది. ఈకేసులో ప్రధాన నిందితుడు అవంతి మేనమామ గూడూరు యుగేందర్‌రెడ్డి కాగా మొత్తం 18 మంది నిందితుల ప్రమేయం ఉంది. ఇప్పటివరకు 14 మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. (మరో ‘పరువు’ హత్య)

మరిన్ని వార్తలు